జైపూర్: భార్య పుట్టింటికి వెళ్తానని చెప్పింది. భర్త వద్దని వారించాడు. లేదు నేను వెళ్లాల్సిందే, నా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేదు పరామర్శించి రావాలి అని భార్య బతిమాలింది. కొన్ని రోజులాగితే నేను కూడా వస్తా, ఇప్పుడు వద్దు అని భర్త సర్దిచెప్పాడు. మరో రోజు కాదు నేను ఈరోజే వెళ్తా అని భార్య మొండికేసింది. అంతే భర్తలో కోపం నశాలానికి ఎక్కింది. దాంతో భార్యకూ కోపం వచ్చింది. ఇద్దరూ చెడామడా తిట్టుకున్నారు. ఈ క్రమంలో భర్త ఇంట్లో కూరగాయలు కోసే కత్తి తీసుకొచ్చి భార్య ముక్కు కేసేశాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం లునావాస్ గ్రామానికి చెందిన భూమా రామ్, పూనమ్ దేవి (25) భార్యాభర్తలు. అయితే ఇటీవల పూనమ్ దేవి తల్లిదండ్రులకు జ్వరాలు రావడంతో పరామర్శించి వస్తానని భర్తను కోరుతున్నది. కానీ భర్త రేపుమాపు అంటూ దాటవేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి పుట్టింటికి వెళ్లేందుకు భర్త అనుమతి కోరింది. ఆరోజు కూడా భర్త వద్దని చెప్పడంతో గొడవ జరిగింది. క్షణికావేశంలో భూమా ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో పూనమ్ దేవి ముక్కు కోశాడు.
ఇది గమనించిన ఇరుగుపొరుగు వాళ్లు పూనమ్ దేవిని ఆస్పత్రికి తరలించారు. పూనమ్ దేవి పుట్టింటి వాళ్లకు కూడా విషయం తెలిసిపోయింది. దాంతో ఆగ్రహానికి గురైన పూనమ్ దేవి సోదరుడు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత తన సోదరి పూనమ్ దేవిని తీసుకెళ్లి రాతపూర్వకంగా కంప్లెయింట్ ఇప్పించాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న భూమా కోసం గాలిస్తున్నారు. కాగా, భూమా తన సోదరిపై చేయి చేసుకోవడం ఇదే మొదటిసారి కాదని, చీటికిమాటికి తన సోదరిని కొట్టడం అతనికి అలవాటుగా మారిందని బాధితురాలు సోదరుడు చెప్పాడు.