లక్నో, మే 24: ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో పన్నాలాల్ అనే ఓ వ్యక్తి తన భార్య అనిత జన్మనివ్వబోతున్న శిశువు లింగత్వాన్ని తెలుసుకునేందుకు కొడవలితో ఆమెపై దాడిచేసి పొట్టను కోసేశాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన 2020 సెప్టెంబర్లో జరిగింది. దీంతో ఆ కర్కోటకుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 22 ఏండ్ల క్రితం పెండ్లి చేసుకున్న ఆ దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
అయినప్పటికీ మగబిడ్డ కోసం వారిద్దరూ తరచూ ఘర్షణ పడేవారు. అనితకు విడాకులిస్తానని, మగబిడ్డ కోసం మరో మహిళను పెండ్లి చేసుకుంటానని పన్నాలాల్ బెదిరించసాగాడు. ఈ క్రమంలో అనిత మరోసారి గర్భం దాల్చడంతో ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు ఆడా, మగా అన్నదానిపై ఇరువురి మధ్య మళ్లీ గొడవ జరిగింది.
కోపోద్రిక్తుడైన పన్నాలాల్ 8 నెలల గర్భంతో ఉన్న అనితను బలంగా ఒడిసి పట్టి, కొడవలితో ఆమె పొట్టను కోసేశాడు. అనంతరం పేగులు వేలాడుతున్న స్థితిలో అనిత బాధతో అరుస్తూ వీధిలోకి పరుగెత్తింది. ఘటనా స్థలం నుంచి పన్నాలాల్ పారిపోయాడు. అనిత ప్రాణాలతో బయటపడింది. కానీ, ఆమె గర్భంలో ఉన్న మగబిడ్డను మాత్రం వైద్యులు కాపాడలేకపోయారు.