కోల్కతా : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్లో శాంతిభద్రతలపై షా చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలోని జహంగీర్పురి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఏం జరిగిందో హోంమంత్రి చూడాలనీ, బెంగాల్ గురించి ఆలోచించొద్దని హితవు పలికారు. విభజన సృష్టించడమే బీజేపీ పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా ఆయన ఏం చేశారనీ, ఈద్ రోజున హింస జరిగిందని ఆరోపించారు.
దేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని కూల్చివేసే పని చేయొద్దన్న మమత.. నిప్పుతో ఆడుకోవద్దని, ప్రజలే తగిన సమాధానమిస్తారన్నారు. సీఏఏ బిల్లుపై మమత మాట్లాడుతూ.. సీఏఏ బిల్లును పార్లమెంట్లో ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. పౌరుల హక్కులను కాలరాయడం తనకు ఇష్టం లేదని, మనమందరం కలిసి జీవించాలన్న మమత.. ఐక్యతే మన బలమని స్పష్టం చేశారు. ఆయన (అమిత్ షా) రాజకీయరంగంలోకి బీఎస్ఎఫ్ చొరబాటు కోసమే ఇక్కడకు వచ్చారని, మీరు హోంమంత్రి అయినందునే నేను మిమ్మల్ని గౌరవిస్తానన్నారు. తనకు మార్గనిర్దేశం చేయొద్దని, రాష్ట్రాన్ని పాలించమని బీఎస్ఎఫ్ను అడగొద్దన్నారు.
‘చొరబాట్లను అరికట్టడం, సరిహద్దుల్లో శాంతి భద్రతలు నెలకొల్పడం మీ విధి’ అన్నారు. సీఏఏ గురించి మాట్లాడే వారు.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను ఎన్నుకునే వారు దేశ పౌరులు కాదా? అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్ల బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదని, సీఏఏను అమలు చేయబోమని స్పష్టం చేశారు. బెంగాల్లో పరిస్థితిపై అమిత్ షా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత హింస, మహిళలపై జరుగుతున్న దాడులపై కళ్లుమూసుకొని.. బెంగాల్లో పరిస్థితిపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.