న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్గా భేటీ అవుతున్నారు. అయితే ఈ మీటింగ్కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూరంగా ఉండనున్నారు. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి హాజరుకానున్నారని సమాచారం.
పశ్చిమబెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ప్రచారం సందర్భంగా ఇరు పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. గతవారం మమతపై నందిగ్రామ్లో దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనికి బీజేపీయే కారణమని అధికారపక్షం ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆమే ప్రధానితో భేటీకి అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నందునే మమతా బెనర్జీ ఈ మీటింగ్కు హాజరుకాలేకపోతున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులతో మరికాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోనున్నారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో తెలుసుకుంటారు. ఏం చెయ్యాలి, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై దిశానిర్ధేశం చేస్తారు.
ప్రధాని మోదీ గతంలో కూడా పలు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ ఏడాది జనవరిలో చివరిసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.