పనాజీ: కాంగ్రెస్ అసమర్థత వల్లే మోదీ బలం పెరిగిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలోని రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవడం లేదని, అందుకే బీజేపీ బలం పెరిగిందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు.
గోవాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్తోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆమె మండిపడ్డారు. ‘ఢిల్లీ చేసే దాదాగిరీ ఇక చెల్లదు’ అని ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే దేశంలో పరిస్థితులు ఇలా తగలడ్డాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆమె.. కాంగ్రెస్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ విషయంలో నేను ఇప్పుడు ఏమీ మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే వాళ్లు రాజకీయాలను సీరియస్గా తీసుకోవడం లేదు. కాంగ్రెస్ కారణంగా మోదీ బలం రోజురోజుకూ పెరిగిపోతోంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
బీజేపీతో పోరాడే అవకాశం కాంగ్రెస్కు గతంలో వచ్చిందని, కానీ వాళ్లు దాన్ని అందిపుచ్చుకోలేదని తెలిపింది. కానీ కాంగ్రెస్ పార్టీ బెంగాల్ రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా పోరాడిందని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రాలు బలంగా ఉన్నప్పుడే కేంద్రం బలంగా ఉంటుందని, కాబట్టి స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.