కోల్కతా/రాయ్గంజ్, ఏప్రిల్ 22: లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లోని మమతాబెనర్జీ సర్కారు భారీ షాక్ తగిలింది. 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. అలాగే ఉద్యోగాలు పొందిన వీరంతా తమ జీతాన్ని వెనక్కి ఇచ్చేయాలని స్పష్టంచేసింది. రికవరీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. నియామక ప్రక్రియపై తదుపరి దర్యాప్తు చేపట్టాలని, మూడు నెలల్లో నివేదిక అందజేయాలని సీబీఐని ఆదేశించింది. కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టాలని పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)కు స్పష్టంచేసింది. 2016లో రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
24,640 ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఈ రిక్రూట్మెంట్లో అక్రమాలు చోటుచేసుకొన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఉన్న ఖాళీల కంటే అధికంగా 25,753 అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారని పిటిషనర్ల తరపు న్యాయవాది ఫిర్దౌస్ షమీమ్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు అనంతరం న్యాయస్థానం బయట వేచిచూస్తున్న వందలాది మంది అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు కోసం తాము ఏండ్లుగా ఎదురుచూస్తున్నామని, చివరకు తమకు న్యాయం జరిగిందని ఓ అభ్యర్థి పేర్కొన్నారు. కాగా, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఎస్ఎస్సీ చైర్మన్ సిద్ధార్ధ్ మజుందార్ తెలిపారు.
కలకత్తా హైకోర్టు తీర్పుపై పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. నియామకాలను రద్దు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని, దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని రాయ్గంజ్లో సోమవారం ఓ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ న్యాయ నిర్ణయాలను కూడా బీజేపీ నేతలు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ‘అన్ని నియామకాలను రద్దు చేయడం చట్టవిరుద్ధం. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటాం. న్యాయం కోసం పోరాడుతాం’ అని మమత స్పష్టం చేశారు.
కరందిఘిలో జరిగిన మరో ర్యాలీలో మమత మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ సూచనల మేరకు ఈ తీర్పు వచ్చిందని ఆరోపించారు. కోర్టులను బీజేపీ తన పార్టీ కార్యాలయాలుగా మార్చుకొన్నదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘బీజేపీ ఒక పిల్ వేస్తే.. దానిపై వెంటనే చర్యలు తీసుకొని జైళ్లకు కూడా పంపిస్తారు. అయితే ఇతరులు పిటిషన్లు వేసినప్పుడు మాత్రం ఎలాంటి చర్యలు ఉండవు’ అని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల కలకత్తా హైకోర్టు జడ్జిగా రాజీనామా చేసి, బీజేపీలో చేరిన అభిజిత్ గంగోపాధ్యాయ్ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ బంధం సుస్పష్టం. అందరికీ కనిపిస్తున్నది’ అని మమత పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలోని ఒక వర్గం రాజీపడేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ‘బీజేపీతో సంబంధాలు ఉన్నవారికి ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయి. బీజేపీ కార్యాలయాల నుంచి వచ్చిన సూచనలే తీర్పు రూపంలో వస్తున్నాయి’ అని మమత ఆరోపించారు.