Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లోక్సభపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆమె చూపు పార్లమెంట్వైపు పడినట్లు సమాచారం. దీంతో త్వరలోనే ఆమె లోక్సభకు పోటీ చేయనుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పశ్చిమ బెంగాల్లో గత ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలై, అధికారం కోల్పోయింది. మమతా బెనర్జీయే అసెంబ్లీ సీటును గెల్చుకోలేకపోయింది.
అటు పార్టీ పరాజయం, ఇటు తాను ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉండటం కంటే ఢిల్లీయే బెటర్ అని మమతా భావిస్తోంది. అందుకే పార్లమెంట్వైపు చూస్తున్నారు. లోక్సభకు తిరిగి ఎంపీగా వెళ్లాలనుకుంటున్నారు. అయితే, ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. ఉప ఎన్నికలూ లేవు. మరెలా..? దీనికి సమాధానం ప్రస్తుతం టీఎంసీ తరఫున ఎంపీగా కొనసాగుతున్న యూసుఫ్ పఠాన్. మాజీ క్రికెటర్ అయిన యూసుఫ్ పఠాన్ 2024లో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని బహరాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన టీఎంసీ తరఫున లోక్సభ ఎంపీగా గెలుపొందారు. కాంగ్రస్ అగ్రనేత అధిర్ రంజాన్ చౌదరిని భారీ మెజారిటీతో ఓడించారు.
అయితే, ఇప్పుడు ఆ స్థానం నుంచి మమత పోటీ చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆ సీటు నుంచి రాజీనామా చేయాలని యూసుఫ్ పఠాన్కు మమత సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ఆయన కూడా సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే, అక్కడ జరిగే ఉప ఎన్నికలో టీఎంసీ తరఫున మమతా బెనర్జీ పోటీ చేస్తారు. మమతా బెనర్జీ గతంలో కూడా ఎంపీగా పనిచేశారు. 1974 నుంచి ఆరుసార్లు కోల్కతా సౌత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1984లో తొలిసారి జాధవ్పూర్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. అనంతరం 1989లో ఓడిపోయారు.
తర్వాత కోల్కతా సౌత్ (ప్రస్తుతం కోల్కతా దక్షిణ్) నియోజకవర్గం నుంచి 1991, 1996లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ టీఎంసీని స్థాపించారు. 1998, 1999, 2004, 2009లో ఎంపీగా గెలిచారు. మరి యూసుఫ్ పఠాన్ రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి పోటీ చేసి గెలుస్తారా లేదా అనేది చూడాలి.