కోల్కతా : డార్జలింగ్ హిల్ పార్టీల ప్రతినిధులతో భేటీ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్వత ప్రాంత ప్రజల బాగు కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చిన దీదీ ఢిల్లీ లడ్డూను తినవద్దని నేతలకు సూచించారు. సోమవారం తాను డార్జలింగ్కు చెందిన నాలుగు రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపానని..ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని తాను కోరుతున్నానని దీదీ పేర్కొన్నారు.
పర్వత ప్రాంత ప్రజల కోసం మనం పనిచేయాలని, డార్జలింగ్ మురిసేలా మనం కలిసికట్టుగా పనిచేద్దామని ఆమె పిలుపు ఇస్తూ ఢిల్లీ లడ్డూను తినవద్దని నేతలకు సూచించారు. ధరల పెంపు నుంచి ప్రజలను మళ్లించేందుకు కేంద్ర పాలకులు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రత్యర్ధులపై ఉసిగొల్పుతారని మోదీ సర్కార్పై దీదీ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాషాయ పార్టీ నేతలు దేశాన్ని కాపాడేవారిగా నమ్మబలుకుతారని అయితే ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని చెప్పారు.
ఇక డార్జలింగ్ ప్రాంతానికి శాశ్వత రాజకీయ పరిష్కారం చూపాలని గూర్ఖా జన్ముక్తి మోర్చా (జీజేఎం) కోరింది. ఉత్తర బెంగాల్లో ఐదు రోజుల పర్యటనకు వచ్చిన మమతా బెనర్జీని సోమవారం జీజేఎం ప్రతినిధి బృందం కలిసింది. భారతీయ గూర్ఖా ప్రజాతంత్రిక్ మోర్చా ప్రతినిధులు దీదీతో సమావేశమయ్యారు.