కూచ్బెహర్/అలీపూరుదౌర్, ఏప్రిల్ 15: బీజేపీ ఆదేశాలతోనే ఎన్నికల సంఘం పనిచేస్తున్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క అల్లర్ల ఘటన జరిగినా ఈసీ కార్యాలయం బయట నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. అలీపూర్దౌర్లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ బీజేపీ కోరిక మేరకే ముర్షీదాబాద్ డీఐజీని ఎన్నికల సంఘం తొలగించిందని ఆరోపించారు. ముర్షీదాబాద్, మాల్దాలో కనుక అల్లర్లు జరిగితే అందుకు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అల్లర్లు, హింసను ప్రేరేపించేందుకు పోలీసుల అధికారులను మార్చాలని బీజేపీ కోరుకుంటున్నదని, ఇక్కడ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నందున ఒక్క ఘటన జరిగినా అందుకు ఈసీ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అవసరం అనుకుంటే ఈసీ కార్యాలయం బయట 55 రోజులపాటు నిరాహారదీక్ష చేస్తానని మమత హెచ్చరించారు. గతంలో సింగూరు రైతుల కోసం 26 రోజులు నిరాహారదీక్ష చేశానని, ఇప్పుడు 55 రోజులు చేయగలనని పేర్కొన్నారు.