దేశంలో అసలు యూపీఏ కూటమే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆమె ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో ఆయన ఇంట్లో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. దేశంలో ప్రస్తుతం సాగుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా బలమైన మార్గాన్ని అనుసరించాలని చెప్పారు.
ఈ విషయంలో శరద్ పవార్ అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు. పవార్తో సమావేశం అనతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా యూపీఏలో చేరతారా? అని జర్నలిస్టులు ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఆమె.. ‘ప్రస్తుతం దేశంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ (యూపీఏ) అసలు లేనే లేదు’ అని స్పష్టం చేశారు.
తాను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ ఇద్దరినీ కలిసేందుకే ముంబై వచ్చానని, కానీ ఉద్ధవ్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన్ను కలవలేకపోయానని వెల్లడించారు. ఉద్ధవ్ లేకపోవడంతో శివసేన నేతలు ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్తో ఆమె సమావేశమయ్యారు.