ముంబై : కాషాయ పార్టీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా దీటైన పోరాటం కొరవడటంతో స్ధిరమైన ప్రత్యామ్నాయ శక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో బుధవారం చర్చలు జరిపిన మీదట దీదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం యూపీఏ లేదని కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
శరద్ పవార్ సీనియర్ నేతని, ఆయనతో రాజకీయ అంశాలు చర్చించానని..పవార్ అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవించానని దీదీ చెప్పుకొచ్చారు. బీజేపీని మట్టికరిపించేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని మమతా బెనర్జీ పిలుపు ఇచ్చిన క్రమంలో శరద్ పవార్తో ఆమె భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక మమత మంగళవారం శివసేన నేతలు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్లతో సమావేశం కాగా బుధవారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయింది. ఠాక్రే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో దీదీని కలవలేకపోయారని తెలిసింది.