కోల్ కతా : పశ్చిమ బెంగాల్ సీఎంగా వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ హింస వెనుక కాషాయపార్టీ హస్తం ఉందని ఆరోపించారు. ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ హింసకు దిగిందని దీదీ మండిపడ్డారు. ఎన్నికల అనంతర హింసలో తమ పార్టీ కార్యకర్తలు మరణిస్తే బీజేపీ నేతలు మాత్రం దుష్ప్రచారానికి తెగబడ్డారని ఆరోపించారు.
రాష్ట్రంలో మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతోందని మమతా బెనర్జీ బుధవారం ఓ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాషాయ పార్టీపై నిప్పులు చెరిగారు. బెంగాల్ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందని తమ పార్టీ విజయంపై దీదీ వ్యాఖ్యానించారు. బెంగాల్ లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంటే రాష్ట్రానికి కేంద్రం వ్యాక్సిన్లను సరఫరా చేయడం లేదని దుయ్యబట్టారు.కరోనా మహమ్మారి కట్టడికే తమ తొలి ప్రాధాన్యతని దీదీ స్పష్టం చేశారు.