కోల్కతా : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై (Odisha Train Accident) పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వ తీరుపై మరోసారి మండిపడ్డారు. వాస్తవాలను మభ్యపెట్టి ఇతరులపై నింద మోపేందుకు ప్రభుత్వం రైలు ప్రమాద ఘటనను రాజకీయం చేస్తోందని విమర్శించారు. బాలాసోర్ రైలు ప్రమాదంలో 275 మంది మరణించారని కేంద్రం అధికారికంగా చెబుతుండగా ఇంకా చాలా మృతదేహాలను గుర్తించాల్సి ఉందని దీదీ పేర్కొన్నారు.
దుర్ఘటనకు సంబంధించి సీబీఐ విచారణపై ఆమె స్పందిస్తూ సీబీఐ విచారణ క్రిమినల్ కేసులకు చేపడతారని, రైల్వే కేసులకు కాదని అన్నారు. సత్యాన్ని అణిచివేయరాదని మోదీ సర్కార్పై దీదీ చురకలు వేశారు. కాగా, బాలాసోర్ రైలు ప్రమాదంలో 275 మంది మృతిచెందగా, ఇప్పటి వరకు 170 మంది మృతదేహాలను గుర్తించినట్లు ఒడిశా సర్కార్ వెల్లడించింది.
బాలాసోర్, భువనేశ్వర్ వద్ద 85 మృతదేహాలు ఉన్నట్లు చెప్పారు. స్వస్థలాలకు ఆ మృతదేహాలను పంపించనున్నారు. త్వరలోనే డెత్ సర్టిఫికేట్లను కూడా పంపనున్నట్లు అధికారులు చెప్పారు. ఏదైనా సందేహాలు ఉంటే.. టోల్ ఫ్రీ నెంబర్(1800-3450061/1929 )కు ఫోన్ చేయగలరని అధికారులు తెలిపారు. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు.
Read More