బాలాసోర్: ఒడిశాలోని బహానగా బజార్ స్టేషన్లో మూడు రైళ్లు ఢీకొన్న(Train Accident) ఘటన తెలిసిందే. అయితే ఆ దుర్ఘటన నుంచి 16 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బెరహంపూర్కు చెందిన ఎజికల్ దాస్ తన భార్య సుమితా దాస్, కుమారుడు జార్జ్ జాకబ్ దాస్తో కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. బీ2 కోచ్లో పేరెంట్స్ ఇద్దరూ ఉన్నారు. ఇక కుమారుడు జార్జ్ జాకబ్కు మాత్రం బీ8 కోచ్లో సీటు కన్ఫర్మ్ అయ్యింది. అయితే బాలాసోర్ స్టేషన్కు రావడానికి ముందు.. తన కుమారుడు జార్జ్ను డిన్నర్ కోసం రావాలని తండ్రి ఫోన్ చేశాడు. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు బీ8 కోచ్ నుంచి బీ2 కోచ్కు జార్జ్ వెళ్లాడు. అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో బీ2 కోచ్కు ఏమీ కాలేదు. దీంతో 16 ఏళ్ల జార్జ్ బ్రతికిపోయాడు. ఆ ప్రమాదంలో బీ8 కోచ్ దెబ్బతిన్నది.
కటక్ రైల్వే స్టేషన్లో 7 గంటల సమయంలో ఫుడ్ ఆర్డర్ చేశానని, 7.05 నుంచి 7.10 నిమిషాల మధ్య భారీ శబ్ధం వినిపించిందని, పది సెకన్లలో సీన్ మొత్తం మారిపోయిందని, కోచ్కు ఏమీ కావొద్దు అని ప్రార్థించానని, రైలు ఆగిన తర్వాత ముందు మా నాన్న ట్రైన్ దిగాడని, ఆ తర్వాత మమ్ముల్ని దిగమన్నాడని జార్జ్ తెలిపాడు. కోచ్ నుంచి దిగిన తర్వాత రైలు డబ్బాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలను చూశామన్నాడు.
లోకో పైలెట్లకు ఎయిమ్స్లో చికిత్స..
కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన ఇద్దరు డ్రైవర్లు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. లోకో పైలెట్తో పాటు అసిస్టెంట్ లోకో పైలెట్ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నట్లు సౌత్ ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్వో తెలిపారు. ప్రస్తుతం ఆ ఇద్దరి ఆరోగ్యం స్టేబుల్గా ఉన్నట్లు తెలిపారు. లోకో పైలెట్ వాంగ్మూలాన్ని తీసుకున్నట్లు సీపీఆర్వో వెల్లడించారు.
170 మృతదేహాలు గుర్తింపు..
బాలాసోర్ రైలు ప్రమాదంలో 275 మంది మృతిచెందగా, ఇప్పటి వరకు 170 మంది మృతదేహాలను గుర్తించినట్లు ఒడిశా సర్కార్ వెల్లడించింది. బాలాసోర్, భువనేశ్వర్ వద్ద 85 మృతదేహాలు ఉన్నట్లు చెప్పారు. స్వస్థలాలకు ఆ మృతదేహాలను పంపించనున్నారు. త్వరలోనే డెత్ సర్టిఫికేట్లను కూడా పంపనున్నట్లు చెప్పారు. ఏదైనా సందేహాలు ఉంటే.. టోల్ ఫ్రీ నెంబర్(1800-3450061/1929 )కు ఫోన్ చేయగలరు. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు.