న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) అనుసరించాల్సిన వ్యూహాలు, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు వంటి అంశాలపై కసరత్తు సాగుతోంది. ఇవే ప్రధాన అజెండాగా ఢిల్లీలో మంగళవారం విపక్ష కూటమి కీలక భేటీ కొనసాగుతోంది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా మల్లికార్జున్ ఖర్గే పేరును ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించినట్టు సమాచారం.
కాగా పీఎం రేసులో తన పేరును తెరపైకి తీసుకురావడం పట్ల ఖర్గే విముఖత వ్యక్తం చేస్తూ సున్నితంగా తిరస్కరించారని విపక్ష కూటమి వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిపై ఎలాంటి నిర్ణయం తీసుకోదని, ఎన్నికల అనంతరమే ప్రధాని ఎవరనేది ఖరారు చేస్తారని మమతా బెనర్జీ సోమవారం వెల్లడించగా మరుసటి రోజే ఈ విషయంలో ఆమె యూటర్న్ తీసుకున్నారు.
విపక్ష ఇండియా కూటమి అభ్యర్ధిగా ఖర్గే పేరును ఆమె ఇవాల్టి భేటీలో ప్రతిపాదించారని తెలిసింది. ఇక ఇటీవల ముగిసిన కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపధ్యంలో ఓటమి నైరాశ్యం ప్రభావం విపక్ష కూటమిపై పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపైనా ఈ భేటీలో విపక్ష నేతలు చర్చిస్తున్నట్టు తెలిసింది.
Read More :