పనాజీ: గోవాపై మమతా బెనర్జీ కన్నేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. తీర ప్రాంత రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ.. వచ్చే ఏడాది గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రకాశంత్ కిషోర్కు చెందిన ఓ బృందం గోవాలో ప్లానింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీకే టీమ్లోని సుమారు 200 మంది .. గోవాలో టీఎంసీ ఎంట్రీ కోసం కసరత్తులు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో.. టీఎంసీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు దీదీ టీమ్ రంగంలోకి దిగుతున్నది. ఇప్పటికే త్రిపురలోనూ బీజేపీకి ధీటైన పోటీని టీఎంసీ ఇస్తోంది.
త్వరలో టీఎంసీ పార్టీ తమ ఎంపీలను గోవాకు పంపాలన్న ప్లాన్లో ఉన్నది. ఆ రాష్ట్ర నేతలతో పలుమార్లు ఆ పార్టీ చర్చలు కూడా జరిపింది. దీదీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ త్వరలోనే గోవా విజిట్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత టీఎంసీ చీఫ్ కూడా ఆ రాష్ట్రాన్ని విజిట్ చేసే ఛాన్సు ఉంది. గోవాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని, అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసినా, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని, టీఎంసీకి ఓటు వేస్తేనే, బీజేపీని దూరం చేయవచ్చు అన్న ఆలోచనల్లో గోవా ప్రజలు ఉన్నట్లు టీఎంసీ చెబుతోంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. గోవాలో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.