న్యూఢిల్లీ : మణిపూర్ అంశంపై సమగ్ర చర్చ జరగాలని తాము కోరుకుంటుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సభకు వచ్చేందుకు సిద్ధంగా లేరని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. సభలో మణిపూర్ వ్యవహారంపై చర్చ జరిగితే కొన్ని వివరాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నది తమ ఉద్దేశమని చెప్పారు.
మణిపూర్ అల్లర్లపై ప్రతిపక్ష సభ్యులు చెప్పే విషయాలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు. ఆపై మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పెద్దల సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు మణిపూర్ పరిస్ధితిపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
మణిపూర్లో భారత్ను పాలక పక్షం హత్య చేసిందని, దేశద్రోహులు ఎన్నటికీ దేశభక్తులు కాలేరని మోదీ సర్కార్పై రాహుల్ విరుచుకుపడ్డారు. బుధవారం అవిశ్వాస తీర్మానంపై ముందుగా మాట్లాడిన రాహుల్ మణిపూర్ హింసపైనా ప్రధాని మోదీ లక్ష్యంగా తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఉద్దేశించి మీరు మణిపూర్లో భారత్ మాతను హత్య చేశారని దుయ్యబట్టారు. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ను ప్రధాని మోదీ సందర్శించలేదని తప్పుపట్టిన రాహుల్ మణిపూర్ భారత్లో అంతర్భాగమని ప్రధాని పరిగణించడం లేదని విమర్శించారు.
Read More :