న్యూఢిల్లీ : పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష ఎంపీలు మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. దేశంలో ఉపాధి లభించక నిరుద్యోగ యువత దిక్కుతోచని స్ధితిలో ఉందని జేడీయూ (JDU) జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాషాయ పార్టీ తన హామీని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని 43 ర్యాలీలు నిర్వహిస్తే బీజేపీకి కేవలం 52 సీట్లే దక్కాయని అన్నారు. మోదీ మేజిక్ పనిచయకపోవడంతో కమలనాధులు లాలూ కుటుంబంపై దాడులు చేయించారని లలన్ సింగ్ లోక్సభలో ఆరోపించారు.
మరోవైపు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ (Smriti Irani) రాహుల్ ఫోబియాతో బాధపడుతున్నారని, ఆమె ఈ ఫోబియా నుంచి బయటపడాలని కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ అన్నారు. లోక్సభలో రాహుల్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగం ముగిసిన తర్వాత ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడని ఆమె చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇక రాహుల్ తర్వాత అవిశ్వాస తీర్మానంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడారు.
రాహుల్ గాంధీ ప్రవర్తన సరిగా లేదని ఆమె ఆరోపించారు. బీజేపీ మహిళా ఎంపీలకు రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.మంత్రి స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తూ రాహుల్ ఆ కిస్సింగ్ సంకేతాలు ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు. రాహుల్ ఫ్లైయింగ్ కిస్ ఆరోపణలు ఎదుర్కొంటూ మరో వివాదంలో చిక్కుకున్నారు. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సూరత్ హైకోర్టు ఆయనకు రెండేండ్ల జైలు శిక్ష విధించడంతో లోక్సభ సెక్రటేరియట్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షను సర్వోన్నత న్యాయస్ధానం నిలిపివేయడంతో ఇటీవల ఆయన లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించారు.
Read More :
Rahul Gandhi: లోక్సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. వీడియో