న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కేవలం గాంధీ కుటుంబాన్ని నిందించడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పార్టీ ఓటమికి నేతలందరూ బాధ్యులేనని ఆయన స్పష్టం చేశారు. జీ-23 నేతలతో ఇటీవల భేటీ అయిన గులాం నబీ ఆజాద్, పార్టీ అధినేత్రి సోనియా గాంధీలు కాంగ్రెస్ను సమైక్యంగా ముందుకు తీసుకువెళ్లడంపై చర్చించడం శుభ పరిణామమని అన్నారు.
జీ-23 నేతలు కాంగ్రెస్లో నాయకత్వ మార్పును కోరడం ప్రస్తావిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని తాము ఎల్లప్పుడూ కోరుకుంటామని తామంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఓటమికి కేవలం గాంధీ కుటుంబాన్నే నిందించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ భేటీలోనూ పలువురు ఇదే విషయం ప్రస్తావించారని చెప్పారు. సోనియా గాంధీతో గులాం నబీ ఆజాద్ భేటీని మల్లికార్జున్ ఖర్గే స్వాగతించారు.
ఆజాద్ ఎన్నో ఏండ్లుగా పార్టీలో ఉన్నారని, ఆయనకు అన్ని విషయాలు తెలుసునని అన్నారు. పార్టీని ఐక్యంగా ఉంచడంపై ఆయన మాట్లాడారని ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. సోనియాతో భేటీ సజావుగా సాగిందని, పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కొనసాగాలని పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారని, సోనియా గాంధీ వైదొలగాలని ఏ ఒక్కరూ చెప్పలేదని, తామంతా కేవలం కొన్ని సూచనలు పంచుకున్నామని సోనియాతో భేటీ అనంతరం ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.