రాయ్పూర్ : కులం, మతం పేరుతో ప్రజలను బీజేపీ మభ్యపెడుతున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. చత్తీస్ఘఢ్ (Chhattisgarh Polls) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సుక్మాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కాంగ్రెస్ను విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. దేశం కోసం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలనే త్యాగం చేశారని గుర్తుచేశారు. బీజేపీలో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించిన ఖర్గే కాషాయ నేతలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు.
ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశామని గొప్పలు చెబుతూ బీజేపీ నేతలు ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని అన్నారు. దేశానికి తొలి మహిళా ప్రధానిని కాంగ్రెస్ పార్టీ అందించిందని వారు గుర్తెరగాలన్నారు. బీసీల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని చెప్పారు. తాము ఎన్నికల్లో గెలవడమే కాదు..దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తుంటారని, గతంలో స్కూళ్లు, బ్యాంకులు, ఉద్యోగాలు ఏమీ లేవని, అవన్నీ తమ పాలన హయాంలోనే తీసుకువచ్చామని చెప్పారు. 70 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని మోదీ అడుగుతుంటారని, తాము దేశాన్ని నిర్మించామని, స్కూళ్లు, ప్రభుత్వ రంగ సంస్దలు, బ్యాంకులు, పరిశ్రమలు వంటివి ఎన్నింటినో తీసుకువచ్చి దేశాభివృద్ధికి పునాదులు వేశామని గుర్తుచేశారు. చత్తీస్ఘఢ్లో మోదీ స్కూళ్లు నిర్మించారా అని ఖర్గే ప్రశ్నించారు.
Read More :
CM KCR | నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చిపట్టింది.. : సీఎం కేసీఆర్