US Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అదనంగా 25శాతం పన్నులు ప్రకటించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో పన్నులు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. దాంతో భారత్ నుంచి అమెరికా మార్కెట్కు వెళ్లే వస్తులపై మొత్తం 50శాతం పన్నులు విధించనున్నారు. అయితే, ట్రంప్ టారిఫ్స్పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుర్పించారు. సుంకాలు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం వైఫల్యంగా అభివర్ణించారు.
భారత దౌత్యం బలహీనంగా, గందరగోళంగా కనిపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ చర్యలు తీసుకున్నారన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని.. ట్రంప్ నిరంతరం భారత్పై ఒత్తిడిని తీసుకువస్తున్నారని ఆరోపించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ట్రంప్.. భారత్ నుంచి అమెరికాకు వచ్చే అనేక ఉత్పత్తులపై అదనంగా 25శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ 25శాతం సుంకాలు ఆగస్టు 7 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే 25శాతం అదనపు సుంకాలను ప్రకటించారు. దాంతో మొత్తం సుంకాలు 50శాతానికి చేరాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోలేకపోయారని.. మంత్రులు నెలల నుంచి చర్చల గురించి మాట్లాడుతున్నారని.. మరికొందరు వాషింగ్టన్లో మకాం వేసినా ఏం జరుగలేదన్నారు. ఈ క్రమంలో పెద్ద దెబ్బ తగిలిందని.. అయినా ప్రధాని మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఆరునెలలుగా మోదీ ప్రభుత్వం అమెరికాతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేకపోయిందని.. ట్రంప్ భారత్ను బెదిరిస్తూ వస్తున్నా.. మోదీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ట్రంప్ బ్రిక్స్, వందశాతం సుంకాలపై వ్యాఖ్యానించినా ప్రధాని ఏమీ మాట్లాడలేదన్నాన్నారు. అమెరికా సుంకాల విధానంపై, ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 50శాతం సుంకాలతో దాదాపు రూ. 3.75 లక్షల కోట్ల ఆర్థిక భారం పడుతుందన్నారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పాడి పరిశ్రమ, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, రత్నాలు, ఆభరణాలు, ఔషధాలు, పెట్రోలియం, వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.