స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు రాజ్యసభ సాక్షిగా బహిర్గతమయ్యాయి. తమ రాష్ట్రంలో ఓబీసీ కులగణన నివేదిక విడుదలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు కొందరు మంత్రులు అడ్డుపడుతున్నారని స్వయానా మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో వాపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది.
ఓబీసీ కులగణనకు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో ఆ నివేదికను ఎందుకు విడుదల చేయడం లేదని రాజ్యసభలో సోమవారం ఖర్గేను ఉద్దేశించి బీజేపీ సభ్యుడు సుశీల్కుమార్ మోదీ నిలదీశారు. దీనిపై స్పందించిన ఖర్గే, ‘అక్కడ అతను(డీకే) వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మీరూ (బీజేపీ) వ్యతిరేకిస్తున్నారు. దీనిని బట్టి అగ్రవర్ణాల వారంతా అంతర్గతంగా ఐక్యంగా ఉన్నారు’ అని పరోక్షంగా శివకుమార్ చర్యను తప్పుపట్టారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించాక కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి ఆశించారు. కాంగ్రెస్ అగ్రనేతలు కూడా శివకుమార్ వైపు మొగ్గు చూపినప్పటికీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకించడం వల్లనే సిద్ధరామయ్యను ఆ పదవి వరించినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. అప్పటి నుంచి కర్ణాటక కాంగ్రెస్లో ఖర్గే వర్సెస్ శివకుమార్ మధ్య విభేదాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఓబీసీ నివేదిక విడుదల చేసే అంశం వీరిద్దరి మధ్య విభేదాలు మరింత పెంచింది. కాగా ఖర్గే వ్యాఖ్యలపై డీకే శివకుమార్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన ఓబీసీ కులగణన శాస్త్రీయంగా జరగలేదనే తాము తిరిగి కులగణనకు డిమాండ్ చేస్తున్నట్టు ఆయన బాహాటంగానే ఖర్గే వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు జాతీయ స్థాయిలో బజారునపడటంతో ఆ పార్టీకి కక్కలేక మింగలేని పరిస్థితి ఏర్పడింది.
సిద్ధు, ఖర్గే వర్సెస్ డీకే
కర్ణాటకలో ఓబీసీ కులగణన నివేదికను అమలు చేయడానికి అదే సామాజిక వర్గాలకు చెందిన సీఎం సిద్ధరామయ్య సుముఖంగా ఉన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే ఓసీ వర్గాలకు చెందిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అదే వర్గాలకు చెందిన కొందరు మంత్రులు నివేదిక విడుదల చేయవద్దని, తిరిగి కులగణన జరగాలని కోరుతూ సీఎంకు లిఖితపూర్వకంగా కోరారు. దీంతో పార్టీ అధిష్ఠానంలో పట్టున్న అటు డీకే శివకుమార్ మాటను కాదనలేక, ఇటు ఓబీసీ నివేదికను విడుదల చేయలేక సిద్ధరామయ్య ఇరకాటంలో పడ్డారు.
అమలు చేయని పక్షంలో తమ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తి (సిద్దరామయ్య) సీఎంగా ఉండి అమలు చేయలేదన్న విమర్శ తప్పదు. అమలు చేస్తే ఓసీ వర్గాలకు చెందిన డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులతో తంటా. కర్ణాటకలో ఈ రకమైన పరిస్థితి ఉంటే, మరోవైపు దేశవ్యాప్తంగా కులగణనకు రాహుల్గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామని ఖర్గే హామీ ఇస్తున్నారు.
చిచ్చురేపిన ఓబీసీ కులగణన
కర్ణాటకలో ఓబీసీ కులగణన నివేదిక ప్రభుత్వానికి సమర్పించినప్పుడు నాడు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్సే అధికారంలో ఉంది. తదుపరి 2018లో ఎన్నికలు సమీపించడంతో ఎన్నికల ముందు నివేదిక విడుదల చేస్తే తలనొప్పులు తప్పవని భయపడిన సిద్ధరామయ్య దానిని అటకెక్కించారు. ఇటీవల ఐదు రాష్ర్టాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడుతామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఓబీసీ కులగణన నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఎందుకు అమలు చేయడం లేదన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ సమాధానం చెప్పలేక ఆత్మరక్షణలో పడింది.
ఈ క్రమంలో ఈ అంశాన్ని బీజేపీ సభ్యుడు సుశీల్కుమార్ రాజ్యసభలో ఖర్గేను నిలదీశారు. దీంట్లో తమ తప్పేమీ లేకపోయినా పార్టీలో కొందరి వల్ల దానిని అమలు చేయలేకపోతున్నట్టు ఖర్గే తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. దానికి తమ పార్టీలో డీకే శివకుమార్ వంటి అగ్రకుల నేతలు అడ్డుపడుతున్నారని ఖర్గే పరోక్షంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్గా మారాయి. కర్ణాటక కాంగ్రెస్లో నెలకొన్న లుకలుకలు బజారున పడ్డాయి.