న్యూఢిల్లీ : ఇతర దేశాలకు చెందిన భూభాగాలను కలిపేసుకుని మ్యాప్లను తిరగరాయడం చైనాకు అలవాటుగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ( Mallikarjun Kharge) మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ భారత్ అంతర్భాగాలని ఖర్గే స్పష్టం చేశారు. చైనా తెరపైకి తెచ్చిన ఎలాంటి మ్యాప్లు దాన్ని మార్చలేవని పేర్కొన్నారు.
చైనా తన స్టాండర్డ్ మ్యాప్ 2023 ఎడిషన్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను తమ భూభాగంగా చూపుతూ మ్యాప్ను అధికారికంగా విడుదల చేసిన నేపధ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ అక్రమంగా చూపడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఆక్షేపిస్తుందని, చైనా సహా పొరుగు దేశాలతో శాంతియుత సహజీవనాన్ని తాము కోరుకుంటామని ట్విట్టర్ వేదికగా ఖర్గే స్పష్టం చేశారు.
వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. భారత భూభాగంలో చైనా దురాక్రమణను ప్రపంచ వేదిక ముందు చాటేందుకు భారత్లో జరిగే జీ-20 సదస్సు సరైన వేదికని ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆక్రమణలో ఉన్న 2000 కిలోమీటర్ల మన భూభాగానికి విముక్తి కల్పించేలా మోదీ ప్రభుత్వం చొరవ చూపాలని మరో ట్వీట్లో కోరారు.
Read More :