న్యూఢిల్లీ: కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ క్రమంలో దాదాపు 20 ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యారు. జూన్ 23న బీహార్ రాజధాని పట్నాలో జరిగిన ఈ సమావేశంలో నేతలంతా బీజేపీని ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
అందుకు కొనసాగింపుగా ఈ నెల 17, 18 తేదీల్లో మరోసారి ప్రతిపక్ష పార్టీలన్నీ కర్ణాటక రాజధాని బెంగళూరులో సమావేశం కాబోతున్నాయి. ఈ మేరకు కలిసి వచ్చే అన్ని ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానాలు పంపించారు. ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని, సమావేశం అనంతరం రాత్రికి డిన్నర్ ఉంటుందని ఆయన చెప్పారు.
రాత్రికి నేతలంతా బెంగళూరులోనే విశ్రాంతి తీసుకుంటారని, ఆ తర్వాత ఈ నెల 18న ఉదయం 11 గంటలకు మరోసారి సమావేశమవుతారని మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. ఇదిలావుంటే ఈ సమావేశానికి మల్లికార్జున్ ఖర్గే పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా ఆహ్వానించారని, ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసిందని, కాంగ్రెస్ సీనియర్ నేత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.