Maldives President : మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు భారత పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఇండియాకు వచ్చిన మొయిజ్జుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో ఇవాళ మొహమ్మద్ మొయిజ్జు భారత దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ,ముయిజ్జుల సమావేశం జరిగింది.
సమావేశం అనంతరం జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మొయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. తనని భారత్కు ఆహ్వానించినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. మాల్దీవులలో పర్యటించే వారిలో భారతీయులే అధికం కావడంతో వీరి సమావేశంలో టూరిజం అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చింది. ఇప్పటికే ఎంతో మంది భారతీయులు మాల్దీవులను సందర్శిస్తుంటారని.. భవిష్యత్తులో మరింత మంది సందర్శిస్తారని కోరుకుంటున్నానని మొయిజ్జు అన్నారు.
‘మాల్దీవులకు అవసరం వచ్చిన ప్రతిసారి భారత్ వెన్నంటి ఉంది. స్నేహ హస్తం అందిస్తోంది. అలాగే తమ దేశ ఆర్థికాభివృద్ధిలో భారత్ది ఎంతో కీలక పాత్ర’ అని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి మాల్దీవులకు అండగా నిలుస్తోన్న ప్రధాని మోదీతోపాటు భారతీయులకు తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, మాల్జీవుల బంధం వందల ఏళ్ల నాటిదన్నారు. అయితే గతంలో మొయిజ్జు చేసిన వ్యాఖ్యలకు ఈ వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం.
ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు భారత పర్యటనలో చేసిన సానుకూల వ్యాఖ్యలతో ఒక రకంగా భారత్, మాల్దీవుల మధ్య గత 10 నెలలుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. గతంలో భారత ప్రధానిని, భారత్ని తక్కువ చేస్తూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దాంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించి ఆ ప్రాంతంలోని అందాల గురించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దాంతో ఇండియన్ టూరిస్టులను మాల్దీవ్స్ వెళ్లకుండా లక్షద్వీప్ వైపు మళ్లించే యోచనలోనే ప్రధాని మోదీ అక్కడ పర్యటించారనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదు.. భారత్ వైపు నుంచి ‘బాయ్కాట్ మాల్దీవ్స్’ అనే నినాదం కూడా వైరల్ అయింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. తాజాగా మొయిజ్జు మాట్లాడిన తీరు ఆ పరిస్థితిని మార్చేసింది.