న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఫోన్ల హ్యాకింగ్ (Phone Hacking) వ్యవహారం మళ్లీ దుమారం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ పలువురు విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. పలువురు ప్రతిపక్ష ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి ఒకేసారి ‘హ్యాకింగ్ అలర్ట్’ సందేశాలు రావడం సంచలనంగా మారింది. ఈ అంశంపై విపక్షాలు కేంద్రంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
తనతో సహా పలువురు విపక్ష నేతల యాపిల్ డివైజ్లకు ఒకేసారి హ్యాకింగ్ అలర్ట్ రావడంతో టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారం లేఖ రాశారు. విపక్ష నేతల ఫోన్లపై సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తూ ప్రభుత్వం నిఘా పెట్టడం రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాధమిక హక్కులపై దాడి చేయడమేనని స్పీకర్కు రాసిన లేఖలో టీఎంసీ ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు.
తమపై ప్రభుత్వ ప్రేరేపిత అటాకర్లు టార్గెట్ చేశారని, ఈ దిశగా పలువురు విపక్ష ఎంపీల ఫోన్లు, ఈమెయిల్ డివైజ్లకు యాపిల్ హ్యాకింగ్ అలర్ట్ పంపిందని లేఖలో ఆమె స్పీకర్కు వివరించారు. దీంతో తమ డేటా, కమ్యూనికేషన్స్, కెమెరా, మైక్రోఫోన్ల భద్రత సైతం ప్రమాదంలో పడిందని మహువా మొయిత్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాలక పక్ష అక్రమాలను ఎండగట్టేందుకు విపక్షంగా స్వేచ్ఛగా పోరాడేందుకు తమకు అవకాశం కల్పిస్తూ తమ డేటా భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆమె స్పీకర్కు విజ్ఞప్తి చేశారు.
Read More :
Jio World Plaza | జియో వరల్డ్ ప్లాజా ప్రారంభం.. అంబానీ పార్టీలో సందడి చేసిన తారలు