Mahua Moitra | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానికి కూడా సమన్లు పంపింది.
కాగా, ప్రశ్నలకు ముడుపుల కేసులో ఇంతకుముందు రెండు సార్లు మహువాకు ఈడీ సమన్లు జారీ చేసినా విచారణకు ఆమె హాజరుకాలేదు. ఇదే కేసులో గత శనివారం సీబీఐ మహువా నివాసాల్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా ఈడీ మూడోసారి ఆమెకు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల కేసులో మహువాపై విచారణ చేపట్టాలని సీబీఐని లోక్పాల్ ఆదేశించింది.