గౌహతి: అస్సాంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు. (Gandhi Statue Removed) టిన్సుకియా జిల్లాలోని దూమ్దూమాలో క్లాక్ టవర్ నిర్మాణం కోసం ఈ చర్యకు పాల్పడ్డారు. గాంధీ చౌక్లో ఉన్న 5.5 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తవ్వి అక్కడి నుంచి తొలగించారు. ఇది వివాదానికి దారితీసింది. దీంతో విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ (ఏఏఎస్యూ) నిరసనలు చేపట్టింది.
కాగా, గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా విగ్రహం తొలగింపుపై మండిపడ్డారు. ‘అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం దిబ్రూగఢ్లో బాపు విగ్రహం స్థానంలో క్లాక్ టవర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడంలో ఆశ్చర్యం లేదు’ అని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం చర్యను తప్పుపట్టారు.
మరోవైపు గాంధీ విగ్రహం తొలగింపు గురించి తనకు తెలియదని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ‘జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం గురించి నాకు తెలియదు. వాస్తవం ఏమిటో తెలుసుకుంటా. మహాత్మా గాంధీకి అస్సాం చాలా రుణపడి ఉంది. నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ గ్రూపింగ్ ప్లాన్ కింద అస్సాంను పాకిస్థాన్లో చేర్చాలని కోరినప్పుడు భారతరత్న గోపీనాథ్ బోర్డోలోయ్కు గాంధీ అండగా నిలిచారు’ అని అన్నారు.