ముంబై: ఒక మహిళ తన భర్తను హత్య చేయించింది. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. చివరకు దర్యాప్తులో పోలీసులకు దొరికిపోయింది. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దహిహండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుండా గ్రామానికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి బుధవారం ఉదయం ఉరికి వేలాడుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కిందకు దించి పరిశీలించారు. అయితే తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు మృతుడి భార్య చెప్పింది.
కాగా, మృతదేహంపై గాయాలు ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 28 ఏళ్ల మృతుడి భార్యను గట్టిగా నిలదీశారు. దీంతో అసలు విషయం చెప్పింది. మద్యానికి బానిస అయిన భర్త నిత్యం తనను వేధించడంతోపాటు కొడుతున్నాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి రూ.30,000 ఇచ్చి హత్య చేయించినట్లు తెలిపింది. ఆ వ్యక్తి తాడుతో గొంతునొక్కి భర్తను హత్య చేశాడని చెప్పింది. అనంతరం సూసైడ్ చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించింది. దీంతో ఆ మహిళతోపాటు హత్య చేసిన కాంట్రాక్ట్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.