ముంబై, సెప్టెంబర్ 8: మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు రిజర్వేషన్ల సెగ తగిలింది. ధన్గర్ కమ్యూనిటీకి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్పై స్పందించని బీజేపీ-షిండే ప్రభుత్వ తీరుకు నిరసనగా ఓ వ్యక్తి మంత్రి రాధాకృష్ణ తలపై పసుపు పొడి చల్లి నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సోలాపూర్లోని ప్రభుత్వ గెస్ట్హౌస్లో మంత్రికి వినతిపత్రం ఇచ్చే సమయంలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా పసుపు పొడి చల్లడంతో మంత్రి అవాక్కయ్యారు.
ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఆయన భద్రతా సిబ్బంది, అనుచరులు.. ఆ వ్యక్తిని చితకబాదారు. ఓవైపు దెబ్బలు తింటూ కూడా.. తమ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గట్టిగా నినాదాలు చేశారు. మంత్రిపై పసుపు పొడి చల్లిన వ్యక్తిని శేఖర్ బంగలేగా గుర్తించారు. అనంతరం శేఖర్ బంగలే మీడియాతో మాట్లాడుతూ తమ సామాజికవర్గం ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ పనిచేసినట్టు తెలిపారు. ధన్గర్ కమ్యూనిటీకి ఎస్టీ హోదా ఇవ్వాల్సిందేనని, లేకుండా సీఎంపై కూడా తమ వర్గం ప్రజలు నల్ల ఇంకు చల్లుతారని హెచ్చరించారు.