హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్స కోసం డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ)ను ఇకపై ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కూడా దేశీయంగా ఉత్పత్తి, పంపిణీ, మార్కెటింగ్ చేయనున్నది. ఈ మేరకు డీఆర్డీవోకు చెందిన డీఆర్డీఈ, ఇన్మాస్తో లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు శుక్రవారం ఈ హైదరాబాదీ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 2-డీజీని ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నది. ఇటీవలే లారస్ ల్యాబ్స్ సైతం 2-డీజీ ఉత్పత్తికి అనుమతులు పొందింది. ఇప్పుడు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఈ జాబితాలోకి చేరింది. కాగా, ‘ఎంఎస్ఎన్ 2డీ’ బ్రాండ్ పేరుతో ఔషధాన్ని మార్కెట్లోకి తేనున్నట్టు ఎంఎస్ఎన్ తెలిపింది. ఒక్కో సాచెట్లో 2.34 గ్రాముల మెడిసిన్ ఉంటుంది. ఎంఎస్ఎన్తోపాటు మ్యాన్కైన్డ్ ఫార్మా సైతం డీఆర్డీవో నుంచి అనుమతులు పొందింది. మరోవైపు హైదరాబాదీ సంస్థ పీఐ ఇండస్ట్రీస్ సైతం 2-డీజీ తయారీకి ఐఐసీటీతో ఒప్పందం చేసుకున్నది. 2-డీజీ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.