పేరుగొప్ప విలువల పార్టీ చేతిలో పార్లమెంటరీ వలువల వస్ర్తాపహరణం జరుగుతున్నది.
దేశం తెరమీద రాష్ట్రపతి ఎన్నికల డ్రామాను చూపిస్తూ తెరచాటున బీజేపీ డెమోక్రసీపై దౌర్జన్యం చేస్తున్నది.
ఘనత వహించిన సిద్ధాంతాల పార్టీ చేతిలో ప్రజాస్వామ్య సిద్ధాంతం ఖూనీ అవుతున్నది.
దేశాన్ని పరిపాలిస్తున్న జాతీయ పార్టీ చేతిలో మహారాష్ట్ర ప్రాంతీయ అస్తిత్వం ప్రమాదంలో పడింది.
ప్రజాస్వామ్య భారతదేశానికి అధినేతను ఎన్నుకొనే శుభతరుణంలోనే కమలనాథులు నియంతృత్వపు కుట్రకు రూపుకట్టారు.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరుపుతున్న అరాజకీయ విస్ఫోటంలో ప్రజాస్వామిక సంప్రదాయాలు తునాతునకలైపోతున్నాయి.
ప్రజాస్వామ్యం పరమ దారుణంగా హత్యకు గురవుతున్నది.
అది కర్ణాటక అయినా, గోవా అయినా, మధ్య ప్రదేశ్ అయినా మరో రాష్ట్రం అయినా, మెజారిటీ ఉన్నా లేకున్నా.. ఫిరాయింపు జరిపైనా, పరాయి పార్టీలను చీల్చి అయినా.. గద్దె నెక్కడమే పెద్ద విజయంగా భావిస్తున్న మోదీ-షా ద్వయం ఈ సారి మహా రాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే సర్కారుపై గురిపెట్టింది. పాత మిత్రుడు బాల్ ఠాక్రే తనయుడు అని కూడా చూడకుండా, బీజేపీ ఎదుగుదలలో శివసేన సహకారం ఎంతో ఉందన్న చరిత్రను పట్టించుకోకుండా, మొన్నటి దాకా మిత్రపక్షమన్న కనీస మర్యాదైనా చూపకుండా మహారాష్ట్ర సర్కారును కూల్చివేసే కుట్రకు బీజేపీ తెగబడింది. బీజేపీలోని శివసే న మిత్రులంతా నివ్వెరపోయి నిశ్చేష్టులై చూస్తుండగా, శివసేనకు ఆప్తపక్షం సంఘ్పరివారం నోరుపెగల్చలేని మౌనాన్ని వహించగా మోదీ-షా ద్వయం సహచర హిందూ పార్టీ ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య సౌధాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తున్నది. ఆక్టోపస్ లాంటి కాడలతో కమలం పువ్వు మరాఠా పులిని కట్టిపడేసే ప్రయత్నం చేస్తున్నది. శివాజీ పుట్టిన గడ్డమీద ద్రోహుల్ని చెంత చేర్చుకొని ‘ఉంటే మాతో.. లేకుంటే అంతమే!’ అంటూ పార్టీలను బెదిరిస్తున్నది బీజేపీ.
ముంబై, జూన్ 21: రెండున్నరేండ్లుగా పగతో రగిలిపోయిన రాజకీయ ‘కమల నాగు’ చివరగా విషాన్ని చిమ్మింది. తనను కాదని వైరివర్గంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మాజీ మిత్రుడిని కాటేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నది. మహారాష్ట్రలో ఉద్ధవ్ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేందుకు పలు మార్లు ప్రయత్నించి విఫలమైన బీజేపీ.. ఎంవీఏ నేతలపైకి పదేపదే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పింది. అయినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు కొత్త కుట్రకు తెరతీసింది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండేను అస్త్రంగా చేసుకున్నది. షిండే, తన అనుచరులైన 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి (జీ-22) ఎంవీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు.
వీరంతా ప్రస్తుతం బీజేపీ అధికారంలోని గుజరాత్లోని సూరత్లో లీ మెరీడియన్ హోటల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. షిండే వర్గం బీజేపీలో చేరే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. షిండేపై శివసేన వేటు వేసింది. శివసేన శాసన సభాపక్ష నేతగా ఆయన్ను తొలగించింది. ఆ స్థానంలో అజయ్ చౌధరీని నియమించింది. ఉద్ధవ్ఠాక్రేకు మద్దతుగా ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. షిండేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తన భర్త కనిపించట్లేదని శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇది మూడో ప్రయత్నమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ప్రస్తుత సంక్షోభం శివసేన అంతర్గత వ్యవహారమని, ఠాక్రే ప్రస్తుత పరిస్థితిని చక్కబెట్టగలడన్న నమ్మకం తనకు ఉన్నదన్నారు.మరో 13 మంది శివసేన ఎమ్మెల్యేల అచూకీ తెలియడంలేదు.
రోజంతా హైడ్రామా..
మహారాష్ట్ర శాసన మండలిలో పది స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగ్గా.. ఇందులో ఎంవీఏ భాగస్వామ్య పార్టీలైన శివసేన 2, ఎన్సీపీ 2, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకున్నది. ప్రతిపక్ష బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. కమలదళానికి నలుగురు అభ్యర్థులను గెలిపించుకొనే సంఖ్యాబలం మాత్రమే ఉన్నప్పటికీ, ఐదుగురిని బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతబలం 106 కాగా.. 133 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులతో పాటు అధికార కూటమికి చెందిన కొందరు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. దీనివల్లే కాంగ్రెస్కు దక్కాల్సిన స్థానం బీజేపీ ఖాతాలోకి చేరింది.
ఎంవీఏ సంకీర్ణ ప్రభుత్వంపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఏక్నాథ్ షిండే వర్గమే క్రాస్ ఓటింగ్కు పాల్పడింది. క్రాస్ ఓటింగ్ అంశంపై చర్చించేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలంతా హాజరవ్వాలని ఆదేశించారు. 55 ఎమ్మెల్యేలకు గానూ శివసేన నుంచి కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. దీనిపై ఆరా తీద్దామని ప్రయత్నించగా.. అప్పటి నుంచి షిండే, ఆయన వర్గం అందుబాటులో లేకుండా పోయారు.
విశ్వసనీయవర్గాల ద్వారా గుజరాత్లోని సూరత్లో షిండే వర్గం (22 మంది రెబెల్స్) ఉన్నదని తెలుసుకున్న సీఎం ఠాక్రే.. చర్చల కోసం రావాల్సిందిగా ఇద్దరు జూనియర్ ఎమ్మెల్యేలను దూతలుగా పంపించారు. అయితే, వారిపై అక్కడ ఉన్న గుజరాత్ పోలీసులు దాడులకు పాల్పడ్డారు. జరుగుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకున్న శివసేన.. రాష్ట్ర అసెంబ్లీ పార్టీ శాసన సభా పక్ష నేతగా షిండేను తొలగించింది. ఆ స్థానంలో అజయ్ చౌధరీని నియమించింది. అయితే, సీఎం పోస్టుపై షిండే దురాశతో లేరని, కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవడంలేదని ఠాక్రే తెలిపారు. అనంతరం సంక్షోభ నివారణ చర్యలకు మరోసారి నడుం బిగించారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం సీనియర్ నేతలు మిలింద్ నర్వేకర్, రవీంద్ర పఠక్ను రాయబారానికి షిండే దగ్గరకు పంపించారు. రెండుగంటల పాటు ఇద్దరు దూతలు షిండేతో చర్చలు జరిపారు.
అనంతరం ఠాక్రేకు ఫోన్ చేసిన షిండే పదినిమిషాల పాటు మాట్లాడారు. బీజేపీతో కలిసి గతంలో లాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని షిండే డిమాండ్ చేశారు. శివసేనతో బీజేపీ సఖ్యంగా లేదని, ఆ పార్టీతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేమని ఠాక్రే పేర్కొన్నారు. దీనిపై స్పందించిన షిండే.. ఎన్సీపీ, కాంగ్రెస్తో శివసేన జట్టు కట్టడం తన వర్గ ఎమ్మెల్యేలకు ఇష్టంలేదని వెల్లడించారు. కడపటి వార్తలు అందే సమయానికి సూరత్లో ఉన్న షిండే రెబెల్ వర్గం అస్సాం రాజధాని గువాహటికి ప్రయాణమైనట్టు సమాచారం. సీఎం నేతృత్వంలో బుధవారం క్యాబినేట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మహా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇది మూడో ప్రయత్నమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటుకు సముఖమే
‘మహా’ సర్కారులో ప్రస్తుతం ఏర్పడిన కుదుపుతో తమ పార్టీకి సంబంధం ఉన్నదన్న వార్తలను బీజేపీ రాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ తోసిపుచ్చారు. అయితే, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి షిండే నుంచి ప్రతిపాదన వస్తే తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
అసంతృప్తి ఎందుకంటే?
సీఎం పదవి విషయంలో అభిప్రాయ భేదాలు రావడంతో 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. బీజేపీకి గుడ్బై చెప్పిన శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ఎంవీఏ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి ఏర్పాటులో షిండే కీలక పాత్ర పోషించారు. బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కాపాడటం కోసం నిరంతరం శ్రమించాడు. సొంత ఖర్చులతో వారిని రిసార్ట్లకు తరలించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శివసేనకు చెందిన వ్యక్తినే సీఎంను చేయాలని అంతా భావించారు.
అయితే, సీఎంగా ఉండేందుకు ఉద్ధవ్ ఠాక్రే విముఖంగా ఉన్నారు. దీంతో రేసులో ఏక్నాథ్ షిండే పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది. కానీ, ఈ ప్రతిపాదనకు ఎన్సీపీ మోకాలడ్డింది. దీంతో ఠాక్రే సీఎం బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ, పార్టీ వ్యవహారాల్లో షిండే క్రియాశీలకంగానే ఉన్నారు. ఎంవీఏ క్యాబినెట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీలో ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ తీరుతో షిండే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది. పార్టీ వ్యవహారాల్లో తనను పక్కనబెట్టి ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ప్రాధాన్యం ఇవ్వడం, తన మంత్రిత్వ శాఖ వ్యవహారాల్లో ఆదిత్య ఠాక్రే జోక్యం చేసుకోవడం షిండేకు మింగుడుపడలేదు. తన శాఖకు సంబంధించిన నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోనీయకుండా ప్రతిదానికి సీఎంవో అనుమతి తప్పనిసరి చేయడం, ఇటీవలి రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను తనను కాదని రౌత్కు అప్పగించడం షిండేను మరింత ఆగ్రహానికి గురిచేసిందని సమాచారం.
ఎవరీ షిండే?
మరాఠా వర్గానికి చెందిన ఏక్నాథ్ షిండేది సతారా స్వస్థలం. అనంతరం ఈయన కుటుంబం థానెలో స్థిరపడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిగ్రీ పూర్తికాకుండానే చదువుకు దూరమైన ఆయన.. కుటుంబానికి అండగా ఉండేందుకు ఆటోరిక్షా డ్రైవర్గానూ పనిచేశారు. 1980ల్లో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే స్ఫూర్తితో రాజకీయాల్లో చేరిన ఆయన క్రమక్రమంగా పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. వరుసగా నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల తర్వాత శాసనసభలో శివసేన పక్షనేత బాధ్యతలు అందుకున్నారు. 2019లోనూ వరుసగా రెండోసారి శివసేన శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్సభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.
అస్సాంకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ, జూన్ 21: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎమ్మెల్యేలు సూరత్ నుంచి అస్సాంలోని గువాహటికి తరలించనున్నట్టు సమాచారం. బుధవారం ఉదయానికి వారు గువాహటికి చేరుకుంటారని తెలిసింది. అస్సాంలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. అక్కడి రాడిసన్ హోటల్లో వీరి కోసం ఇప్పటికే బస ఏర్పాటు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
హోటళ్లకు శివసేన ఎమ్మెల్యేలు
ముంబై: ఏక్నాథ్ సిండే నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసిన నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి శివసేన చర్యలు చేపట్టింది. తమ ఎమ్మెల్యేలందరినీ ముంబైలోని వివిధ హోటళ్లకు తరలించినట్టు పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఏ హోటళ్లకు తరలించింది వెల్లడించలేదు.