ముంబై : దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మోదీ సర్కార్ లక్ష్యంగా మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోదీ ఫోటో ముద్రిస్తే కొవిడ్ మరణాలకు సంబంధించి డెత్ సర్టిఫికెట్ల పైనా ఆయన ఫోటో ముద్రించాలని అన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ తన ఘనతగా మోదీ చెప్పుకోదలిస్తే మహమ్మారి కారణంగా చోటుచేసుకుంటున్న మరణాలకూ ఆయన బాధ్యత తీసుకోవాలని మాలిక్ డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోదీ ఫోటో ప్రచురించినట్టే డెత్ సర్టిఫికెట్లపైనా ఆయన ఫోటో ఉంచాలని తాము కోరుతున్నామని అన్నారు. కరోనా కేసుల పెరుగుదలతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంత్యక్రియలు నిర్వహించే వారితో స్మశానాలు కిటకిటలాడుతున్నాయనే వీడియోలు వైరల్ అవుతున్నాయని గుర్తుచేశారు. దేశంలో దారుణ పరిస్ధితులు ఎందుకు ఏర్పడ్డాయో కేంద్రం సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.