ముంబై : మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నిస్తున్నారు. నవాబ్ మాలిక్పై ఈడీ కేసులపై ఆ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని విమర్శించినందుకే మాలిక్పై కేసులు పెట్టారని మండిపడుతున్నారు.
బుధవారం ఉదయం ఈడీ అధికారులు నవాబ్ మాలిక్ నివాసానికి వచ్చినట్లు ఆయన కార్యాలయ సిబ్బంది ప్రకటించారు. అనంతరం నవాబ్ మాలిక్ను ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. మాలిక్ వెంట ఆయన కుమారుడితో పాటు లాయర్ అమీర్ మాలిక్ ఉన్నారు.
ఈ ఘటనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. నవాబ్ మాలిక్ సీనియర్ లీడర్. ఆయన మహారాష్ట్ర కేబినెట్ మంత్రి కూడా. అలాంటి వ్యక్తికి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఈడీ ప్రశ్నించడం సరికాదన్నారు. కేంద్రం సంస్థలను బీజేపీ దుర్వినియోగ పరుస్తోందని మండిపడ్డారు. 2024 తర్వాత మీకు కూడా ఇదే గతి పడుతుంది.. గుర్తుంచుకోవాలని సంజయ్ రౌత్ సూచించారు.
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నవాబ్ మాలిక్ను ఈడీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించడాన్ని మంత్రి జయంత్ పాటిల్ తప్పుబట్టారు. గత కొద్ది రోజుల నుంచి మాలిక్.. బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవాబ్ మాలిక్తో పాటు మహా వికాస్ అగాఢీకి ఈడీ నోటీసులు వస్తాయని గత కొద్దిరోజుల నుంచి బీజేపీ నాయకులు ట్వీట్లు చేస్తున్నారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే గుర్తు చేశారు. అయితే మాలిక్కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఈడీ ప్రశ్నించడం సరికాదు. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ కొత్త రాజకీయాలు చేస్తోంది. ఇది మహారాష్ట్రకు అవమానకరం అని సుప్రియా సూలే మండిపడ్డారు.