Maharashtra : మరాఠాలు కోరిన విధంగా వారికి రిజర్వేషన్లు కల్పించేలా చట్టాన్ని తీసుకొచ్చామని మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ పేర్కొన్నారు. ఈ దిశగా కసరత్తును వేగవంతం చేసి చట్టంపై కసరత్తు చేయడం జరిగిందని అన్నారు. ఈ చట్టంతో పాటు మరాఠాలు మరికొన్ని డిమాండ్లను తెరపైకి తీసుకరాగా, వాటిపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి చెప్పారు. మరాఠా కోటాపై ఓబీసీ వర్గాల్లో ఎలాంటి భయాలు, అపోహలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఆయా వర్గాల రిజర్వేషన్లను కుదించకుండానే మరాఠా రిజర్వేషన్ కల్పిస్తామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం ఈ అంశాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని, ఈ భేటీకి విపక్ష ఎంవీఏ ప్రతినిధులు హాజరు కాలేదని అన్నారు. అఖిలపక్ష భేటీకి ఎందుకు హాజరుకాలేదని విపక్షాలను ఆయన ప్రశ్నించారు. విపక్ష నేతను కలిసేందుకు స్వయంగా పాలక పార్టీ మంత్రులు వెళ్లారని వివరించారు.
మరోవైపు మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అంతకుముందు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చెప్పిన విధంగా మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించామని, ఓబీసీ, ఇతర వర్గాల రిజర్వేషన్లో కోత విధించకుండానే మరాఠా కోటా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, మరాఠా కోటాను అడ్డుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నా కోర్టు స్టే ఇవ్వలేదని అన్నారు.
మరాఠా రిజర్వేషన్లకు అనుగుణంగా నియామకాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. మరాఠ్వాడాలో కుంబి సర్టిఫికెట్లపై జస్టిస్ షిండే కమిటీ కసరత్తు సాగిస్తున్నదని తెలిపారు. నిన్నటి సమావేశంలో ముందుకొచ్చిన అనేక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, ఆయా అంశాలపై కసరత్తు సాగిస్తుందని సీఎం షిండే వెల్లడించారు.
Read More :