ముంబై, జనవరి 26: మరాఠా కోటా రిజర్వేషన్లపై శనివారం ఉదయం 11 గంటల్లోపు తేల్చాలని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే మహారాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. రిజర్వేషన్లకు సంబంధించి శుక్రవారం రాత్రిలోపు ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. లేకుంటే శనివారం 12 గంటలకు తన కార్యాచరణను ప్రకటిస్తానని హెచ్చరించారు. మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్ జరాంగే నేతృత్వంలో కొంతకాలంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రిజర్వేషన్లు కల్పించడానికి గడువు కోరిన ప్రభుత్వం.. గడువు తీరినా కూడా స్పందించకపోవడంతో తాడోపేడో తేల్చుకోవడానికి జరాంగే నేతృత్వంలో వేలమంది ముంబై దిశగా ర్యాలీ చేపట్టారు. అయినా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో తాజాగా జరాంగే డెడ్లైన్ విధించారు.
‘రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్నది. ర్యాలీ దాదాపు ముంబై దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పే మాటలు వినే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం శనివారం ఉదయం 11 గంటలలోపు అధికార ప్రకటన చేయాలి. లేకుంటే 12 గంటలకు కార్యాచరణ ప్రకటిస్తా. మా అడుగులు ముంబైలోని ఆజాద్ మైదాన్ దిశగానే పడుతాయి. ఒక్కసారి అడుగు పడిందంటే వెనక్కి తిరిగి చూసేది లేదు. మా డిమాండ్ను సాధించుకున్నాకే తిరిగి ఇంటికి వెళ్తాం’ అని జరాంగే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం నుంచే తిండి తినడం మానేశానని, కేవలం నీళ్లు తాగుతున్నానని తెలిపారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించారు. మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి దీపక్ కేసార్కర్ స్పందిస్తూ జరాంగే డిమాండ్లను అంగీకరిస్తున్నామని, ప్రభుత్వ విధానాల ప్రకారం వీటిని నెరవేరుస్తామని చెప్పారు. మరోవైపు ముంబైలోని ఆజాద్ మైదాన్లోకి ప్రవేశించేందుకు మరాఠా ఉద్యమకారులకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.