ముంబై: కరోనా మహమ్మారి మహారాష్ట్రలో (Maharashtra) మరోసారి విజృంభిస్తున్నది. మొదటి రెండు దశల్లో కరోనాకు (Corona) కేంద్రబిందువుగా ఉన్న రాష్ట్రం.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు (Omicron) కూడా ప్రధాన కేంద్రంగా మారింది. మరఠ్వాడలో నిన్న ఒకేరోజు 198 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీనిప్రభావంతో 5368 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఇది బుధవారం నాటికంటే 37 శాతం అధికమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కోరలు చాస్తున్నది. మహానగరంలో కొత్తగా 3671 కేసులు నమోదయ్యాయి. ఇందులో 190 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. అంటే రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో 90 శాతానికపైగా ఇక్కడే ఉన్నాయన్నమాట. మొత్తంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 450కి చేరింది.
దీంతో బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమయింది. కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. రోడ్లపై ప్రజలు గుమికూడటాన్ని నిషేధించింది. పెరుగుతున్న కరోనా కేసులను నిలువరించడానికి మరోసారి వార్డు స్థాయి వార్ రూమ్లను ఏర్పాటుచేసింది. దీనిద్వారా క్షేత్రస్థాయిలో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజువేసుకుంటున్నది.