న్యూఢిల్లీ: మహారాష్ట్రలో వేల మంది రైతులు చేపట్టిన ‘కిసాన్ మార్చ్’తో శివసేన, బీజేపీ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రభుత్వం ముందుంచిన రైతుల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమని రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖీ పటేల్ గురువారం ప్రకటించారు. దీనికంటే ముందు ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) నేతృత్వంలోని రైతు సంఘాల నాయకులు, మంత్రి రాధాకృష్ణ పటేల్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధుల బృందానికి మధ్య సుదీర్ఘంగా చర్చలు సాగాయి.
‘నిర్దిష్ట కాల పరిమితిలో డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి హామీ లభించింది. దీంతో కిసాన్ పాదయాత్రను ఆపేస్తున్నా’మని ఏఐకేఎస్ నాయకుడు అజిత్ నావలే ప్రకటించారు. డిమాండ్ల పరిష్కారానికి ఏఐకేఎస్ నేతృత్వంలోని వేల మంది రైతులు అకోలా నుంచి లోన్ వరకూ 53 కిలోమీటర్ల కిసాన్ మార్చ్ను చేపట్టిన సంగతి తెలిసిందే.