ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ముంబైపై గవర్నర్ వ్యాఖ్యలను తాను సమర్ధించబోనని స్పష్టం చేశారు. ముంబై అభివృద్ధిలో మరాఠీల పాత్ర విస్మరంచలేనిదని అన్నారు. గవర్నర్ ఆయన వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించారని, కానీ తాము ఆయన వ్యాఖ్యలను సమర్ధించమన్నారు.
ముంబై వృద్ధికి ముంబైకర్లు, మరాఠీలు చేసిన కృషిని మరువలేమని చెప్పారు. గవర్నర్ పోస్ట్ రాజ్యాంగ పదవని, రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ఆయన మాట్లాడాలని షిండే వ్యాఖ్యానించారు. గుజరాతీలు, రాజస్దానీలను వెళ్లగొడితే మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై, థానేలో డబ్బులు ఉండవని, ఆర్ధిక రాజధానిగా పేరొందిన ముంబై ఆ పేరు నిలబెట్టుకోలేదని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఇక కోశ్యారీ వ్యాఖ్యలను శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు. గవర్నర్ వ్యాఖ్యలు మరాఠీలను అవమానించేలా ఉన్నాయని అన్నారు. గవర్నర్ అన్ని హద్దులను అధిగమించి వ్యవహరిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలపై మరాఠీల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని చెప్పారు.