Onions | కొల్హాపూర్/నాసిక్, ఫిబ్రవరి 23: దాదాపు 512 కిలోల ఉల్లిగడ్డలను అమ్మితే వచ్చింది 2 రూపాయలే. ఈ చేదు అనుభవం మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన ఓ రైతుకు ఎదురైంది. రాజేంద్ర చవాన్ అనే రైతు ఈ నెల 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి తీసుకొచ్చాడు. అయితే ధర లేదని చెప్పిన కొనుగోలుదారులు, రూపాయికి కిలో చొప్పున కొనుగోలు చేశారు. మొత్తం 512 కిలోల ఉల్లగడ్డలకు రూ.512 రాగా అందులో రవాణా, కూలీ, ఇతరత్రా ఖర్చుల కింద రూ. 509.51 పోయాయి. రూ.2.49 మిగలగా రౌండ్ఫిగర్గా రెండు రూపాయల చెక్కును రైతుకు ఇచ్చారు. దీంతో ఆ రైతు కన్నీటిపర్యంతమయ్యారు. ఎంతో కష్టపడి పంట పండిస్తే మిగిలేది రెండు రూపాయలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ గురువారం రైతులు రోడ్డెక్కారు. కొల్హాపూర్, నాసిక్, సతారా, సాంగ్లి తదితర ప్రాంతాల్లో రోడ్లను దిగ్బంధించారు. వ్యవసాయానికి సరిపడా కరెంటు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ఉల్లిగడ్డలు, పత్తికి సరైన ధర లభించడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. సోలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 512 కిలోల ఉల్లిగడ్డలు అమ్మితే 2 రూపాయలు రావడమేంటని ప్రశ్నించారు.