ముంబై: మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో 123 హెక్టార్ల భూమిని 2015-2018 మధ్య చట్ట విరుద్ధంగా అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(ఏటీఎల్)కు బదిలీ చేశారని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేకు విధేయుడైన వినాయక్ గురువారం మీడియాతో మాట్లాడారు. రాయ్పూర్ రాజ్నందన్గావ్ వారోరా ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ను ఏటీఎల్కు 2015లో అప్పగించారని వెల్లడించారు.
ఈ కంపెనీ పవర్ లైన్స్ వేయడం కోసం విదర్భ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో అటవీ శాఖ భూమిని సేకరించిందని, దానికి బదులుగా రత్నగిరి జిల్లాలోని భూమిని అటవీ శాఖకు ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు. సంగమేశ్వర్ ప్రాంతంలో బలహీన వర్గాల ప్రజల నుంచి 5 వేల ఎకరాల భూమిని అదానీ కంపెనీ కొన్నదని, అన్ని లావాదేవీలు ఒక వారంలో పూర్తయ్యాయని వినాయక్ తెలిపారు. మంత్రి ఒకరు స్థానిక అధికారులను ఈ విషయమై బెదిరించారని ఆయన ఆరోపించారు. రౌత్ ఆరోపణలపై స్పందించేందుకు అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి నిరాకరించారు.