ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్తో పాటు మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే, కుందన్ షిండేలను సీబీఐ కస్టడీలోకి తీసుకోనున్నది. అవినీతి కేసులో ముగ్గురిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించనున్నది. మరరో వైపు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. అనిల్ దేశ్ముఖ్పై కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో జరగాలన్న మహా సర్కారు విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఈ విషయంపై ఇక తాము కలగజేసుకోబోమని స్పష్టం చేసింది. అనిల్దేశ్ముఖ్.. హోం మంత్రిగా ఉన్న సమయంలో పోలీసుల బదిలీలు, పోస్టింగ్ల కోసం లంచం తీసుకున్నారని ముంబయి మాజీ పోలీసు కమీషనర్ పరమ్బీర్ సింగ్ ఆరోపించారు. అయితే, ఈ విచారణ కోర్టు పర్యవేక్షణలో ఉన్న సిట్కు అప్పగించాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. మహారాష్ట్ర మాజీ చీఫ్ సుభోద్ కుమార్ జైస్వాల్.. దర్యాప్తు సంస్థకు చీఫ్గా ఉన్నందున.. విచారణ పక్షపాతంగా సాగుతుందని పిటిషన్లో పేర్కొంది.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్కే కౌల్, ఎంఎం సుందరేశ్ ధర్మాసనం జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ.. పిటిషన్ను కొట్టివేసింది. ఇదిలా ఉండగా.. బాంబే హైకోర్టు అనిల్ దేశ్ముఖ్ బెయిల్ పిటిషన్ను ఈ నెల 8న విచారించనున్నది. ఇంతకు ముందు మార్చి 25న జరిగిన విచారణ సందర్భంగా బెయిల్ దరఖాస్తుపై వారంలోగా సమాధానం ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం మాజీ హోంశాఖ మంత్రి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు.