ముంబై : ‘నీకెంత ధైర్యం? నీ మీద చర్యలు తీసుకుంటా? కనీసం నా ముఖాన్నైనా నువ్వు గుర్తు పడతావా?’ అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒక మహిళా ఐపీఎస్ అధికారిని బెదిరిస్తూ ఫోన్లో చిందులు తొక్కారు. ఎన్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన ఐపీఎస్ అధికారిణి అంజలి కృష్ణకు ఫోన్ చేసిన అజిత్ పవార్ ఆమెను బెదిరించారు. ‘చూడు.. నేను ఉప ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా.. వెంటనే నీవు చేస్తున్న పనిని ఆపేయ్’ అంటూ ఆదేశించారు. అయితే తాను అతడి గొంతును గుర్తుపట్టలేకపోతున్నానని ఆమె పేర్కొనడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఎంత ధైర్యం నా గొంతే గుర్తు పట్టలేవా? నీపై చర్య తీసుకంటా’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తర్వాత వీడియో కాల్లోకి వచ్చారు. అక్రమ తవ్వకందారులపై చర్యలు ఆపేయాలంటూ ఆయన ఆమెను ఆదేశించారు. ఒక నిర్మాణ ప్రాజెక్టు కోసం సోలాపూర్ జిల్లా కుర్దు గ్రామంలో ఎర్రమట్టిని విచ్చలవిడిగా తవ్వేస్తుండటంతో దానిపై విచారణకు అంజలి కృష్ణ అధికారులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి ఎన్సీపీ కార్యకర్తలతో అధికారులకు వాగ్వాదం జరిగింది. ఎన్సీపీ కార్యకర్త బాబా జగతప్ నేరుగా డిప్యూటీ సీఎంకు ఫోన్ చేసి, ఆయనతో మాట్లాడాలని కృష్ణకు ఫోన్ అందించిన క్రమంలో పై సంభాషణ జరిగింది.