న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ వైపరీత్యంగా పరిగణించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే లేఖ రాశారు. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటిస్తే రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులను (ఎస్డీఆర్పీ) నిధులను కరోనా సాయం కింద బాధితులకు వెచ్చించే వెసులుబాటు కలుగుతుందని లేఖలో ఉద్ధవ్ పేర్కొన్నారు.
చిరు వ్యాపారులకు ఊరట ఇచ్చేలా మార్చి, ఏప్రిల్ మాసాలకు సంబంధించి జీఎస్టీ రిటన్స్ దాఖలు గడువును పొడిగించాలని కోరారు. మహారాష్ట్రలో కొవిడ్ తీవ్రత నేపథ్యంలో మినీ లాక్డౌన్ అవసరమని లేఖలో ప్రస్తావించారు. లాక్డౌన్ సమయంలో జీవనోపాధి దెబ్బతినే వారికి ఆర్థిక సాయం చేసేందుకు విపత్తు నిధులను వాడే వెసులుబాటు కలిగేందుకు కరోనా మహమ్మారిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఠాక్రే కోరారు.