ముంబై: మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్(Maratha Reservation) కల్పిస్తూ రూపొందించిన ముసాయిదాకు మహారాష్ట్ర క్యాబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం ఏకనాథ్ నేతృత్వంలోని సర్కార్ నిర్ణయించింది. మరాఠా కోటా బిల్లును మహా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గత దశాబ్ధ కాలంలో ఇది మూడవసారి. రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపేందుకే ఇవాళ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరాఠా కోటా కోసం మనోజ్ జారంగే పాటిల్ అనే సామాజిక కార్యకర్త జాల్నా జిల్లాలో నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్(ఎంబీసీసీ) చైర్మెన్ జస్టిస్ సునిల్ శుక్రే ఇచ్చిన నివేదిక ఆధారంగా మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారు. మహారాష్ట్రలో ఇప్పటికు ఆర్థికంగా వెనుబడిన వర్గాల కోసం 10 శాతం రిజర్వేషన్ ఇప్పటికే అమలులో ఉన్నది. దాంట్లో కూడా మరాఠాలే అత్యధికంగా బెనిఫిట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఫడ్నవీస్ ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న రీతిలోనే.. ఇప్పుడు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని సర్కారు కూడా విద్యా, ఉద్యోగాల్లో మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. అసెంబ్లీలో రిపోర్టును సమర్పించిన తర్వాత.. ఆ రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం ఇటీవల వెల్లడించారు.