Phone Hacked | ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ సర్వసాధారణమైపోయింది. నెట్ డేటా ఛార్జీలు తక్కువ ధరలు ఉండటంతో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ను విరివిగా వినియోగిస్తున్నారు. ఇదే సందర్భంలో బ్యాంకులకు వెళ్లే పనిలేకుండా స్మార్ట్పోన్లల్లోనే నగదు బదిలీలను సైతం చాలా సులువుగా చేసుకుంటున్నారు. ఇదే అదునుగా చేసుకొని సైబర్ నేరగాళ్లు స్మార్ట్ ఫోన్లల్లోకి చొరబడి సొమ్మును స్వాహా చేసేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సబంధించిన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు.
మహారాష్ట్ర థానేకి చెందిన ఓ వ్యాపారవేత్త ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 6-7వ తేదీల్లో సదరు వ్యాపారి ఫోన్ హ్యాక్కు గురైనట్లు గుర్తించామన్నారు. అతని బ్యాంకు ఖాతాల నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇతర ఖాతాలకు నగదు బదిలీ చేసుకున్నట్లు చెప్పారు. మొత్తం 99.50లక్షల రూపాయలను హ్యాకర్లు దోచుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.