ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 25 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.4 లక్షలు దాటింది. మంగళవారం నుంచి బుధవారం వరకు రికార్డుస్థాయిలో కొత్తగా 31,855 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,64,881కు, మరణాల సంఖ్య 53,684కు చేరింది. అలాగే ముంబైలో బుధవారం గరిష్ఠంగా 5,185 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 15,098 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 22,62,593కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,47,299 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.