నాగ్పూర్ : ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు రూ.కోట్లు ఎరగా వేసి వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తుంటే… ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం లంచాలు ఇస్తున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే క్యాబినెట్లో మంత్రి పదవిని ఆశిస్తూ బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రూ.కోట్లు ఓ వ్యక్తికి ముట్టజెప్పిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని భావించి ముగ్గురు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి లంచం ఇవ్వజూపారు.
గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన నీరజ్సింగ్ రాథోడ్ తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పీఏని అంటూ బీజేపీ ఎమ్మెల్యేలకు పరిచయం అయ్యారు. తమకు మంత్రి పదవులు ఇప్పించాలని వారు కోరగా… అధిష్ఠానానికి లంచం ఇస్తే మీ పని సులువుగా జరుగుతుందని వారిని ఆయన నమ్మించాడు. దీంతో ఆ ఎమ్మెల్యేలు రూ.కోట్లు ముట్టజెప్పారు. అనంతరం అతను ముఖం చాటేశాడు.