లక్నో/ముంబై, ఏప్రిల్ 15: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో శనివారం రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మృతిచెందగా, 25 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఖొపోలి ప్రాంతంలో జరిగింది.
మరోవైపు యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి వంతెన పైనుంచి పడిన ఘటనలో 12 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను సమీప దవాఖానలకు తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.