న్యూఢిల్లీ: రైతు, కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలు సోమవారం రెండో రోజూ కొనసాగాయి. అసెంబ్లీ ఎన్నికల ఐదు రాష్ర్టాలు మినహా దాదాపు ఇతర అన్ని రాష్ర్టాల రాజధానుల్లో రైతులు, కార్మికులు నిరసనలు చేపట్టారు. మోదీ సర్కార్ అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ తీసుకొంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, మోసానికి గురవుతున్నారని నేతలు తమ ప్రసంగాల్లో విమర్శించారు.
పంటలకు కనీస మద్దతు ధర, లేబర్ కోడ్ల రద్దు, పీఎస్యూ ప్రైవేటీకరణను ఆపాలనే తదితర డిమాండ్లపై సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు మూడు రోజుల పాటు దేశవ్యాప్త ‘మహాపడావ్’కు పిలుపునిచ్చాయి. ఆందోళనకారులు మంగళవారం అన్ని రాష్ర్టాల్లోని రాజ్భవన్లకు మార్చ్ చేపట్టనున్నారు. తమ డిమాండ్లతో కూడిన చార్టర్ను గవర్నర్లకు అందించనున్నామని రైతు, కార్మిక నేతలు తెలిపారు. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకొన్నదని, ఇందుకు నయా ఉదారవాద విధానాలే కారణమని ఎస్కేఎం ఓ ప్రకటనలో విమర్శించింది. కేవలం రైతులపై మాత్రమే కాకుండా కార్మికులు, యువతపై ఈ సంక్షోభ ప్రభావం పడుతున్నదని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ సర్కార్ కార్పొరేట్ దోపిడీకి యథేచ్ఛగా అవకాశాలు కల్పిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది.